కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర ప్రయాణాలు నీటిమట్టం పెరిగితే ప్రాణాలకే ముప్పు

వర్షాకాలంలో పది గ్రామాల ప్రజల అవస్థలు, కార్యరూపం దాల్చని వంతెన నిర్మాణం:


ఇక్కడ వర్షాలు పడే ప్రతిసారీ నీటి ప్రవాహం ఉదృతంగా ఉండటంతో కొత్తవలస, గెడ్డలుప్పి, డి.శిర్లాం, వెంకట భైరిపురం, వీరభద్రపురం, అంటివలస గ్రామస్థులకు ఇబ్బందులు తప్పట్లేదు. ప్రవాహంలోంచి బిక్కుబిక్కుమంటూ ముందుకు సాగాలి. అయిదు గ్రామాల ప్రజల అవస్థలివి. సువర్ణముఖి నదిపై నిర్మించిన కొత్తవలస డ్యామ్‌పై ప్రమాదకర పరిస్థితులివి. సువర్ణముఖి నదిపై కొత్తవలస వద్ద సీతానగరం సాగునీటి ప్రాజెక్ట్‌ను నిర్మించారు. సీతానగరం, మక్కువ మండలాల తదితర గ్రామాల ప్రజల వ్యవసాయ పనులకు, మూడు మండలాల ప్రయాణికులకు ఇదే రహదారి కావడంతో నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో డ్యామ్‌పై నుంచి నీరు ప్రవహించేటప్పుడు, అకస్మాత్తుగా నీరు ఎగువ నుంచి విడుదలైనప్పుడు ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

నీటి ప్రవాహంలోంచి వచ్చే పాదచారులు, వాహన చోదకులు 50 మీటర్ల లోతులోని నదిలో పడి మత్యువాత పడిన సందర్భాలున్నాయి. ఏటా వర్షాకాలంలో లెక్కలేనన్ని పశువులు కూడా నదిలో పడి మతి చెందుతున్నాయి. 

వర్షాకాలంలో నరకయాతన: వై.వాసుదేవరావు, కొత్తవలస, మాజీ సర్పంచ్

వర్షాకాలం వస్తే పనులు, నిత్యావసర సరుకుల కోసం బయటికెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నాం. డి.శిర్లాం– వెంకట భైరిపురం గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రమాదాల నివారణకు సత్వరమే చర్యలు తీసుకోవాలి.   

కొత్తవలస డ్యామ్‌పై ఏటా ప్రమాదాలు: ఆర్.ఉమ, కొత్తవలస, సర్పంచ్

వర్షాకాలంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నాం. కొత్తవలస డ్యామ్‌ వద్ద ఏటా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు తక్షణమే వంతెన నిర్మించాలి.

వెంకటభైరిపురం–కొత్తవలస గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెనకు బడ్జెట్ పెంచాలి: డి.పరమహంస, సర్పంచ్, వెంకట భైరిపురం 

తక్షణమే ఈ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి: శ్వాస ఆర్గనైజేషన్ సభ్యులు, కొత్తవలస

అప్పట్లో చంద్రబాబు గారు 1999 లో ఎన్నికల ప్రచారానికి కొత్తవలస మీదుగా వచ్చినప్పటి నుండి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం, హమీ ఇవ్వటం జరిగింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మక్కువ మండంలం వెంకటభైరిపురం–డి.శిర్లాం గ్రామాల మధ్య సువర్ణముఖి నదిపై వంతెన నిర్మించాలని అప్పటిమంత్రులు బి.సత్యనారాయణ, ఎస్‌.విజయ రామరాజు నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు సర్వే నిర్వహించి నదిలో బోర్లు వేయించారు. అనంతరం ఆ విషయం మరుగున పడింది. కనీసం  ఇప్పటి ప్రభుత్వమైనా ఈ పెద్ద సమస్యను చిన్నచూపు చూడకుండా త్వరితగతిన సమస్యను అర్ధంచేసుకుని, పనులు పూర్తి చేసి 3 మండలాల ప్రజల కష్టాలు తీరుస్తారని ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. 

కొత్తవలస, డి.శిర్లాం, గెడ్డలుప్పి గ్రామస్తుల తిప్పలు:  చుట్టుప్రక్కల ప్రజలు

బొబ్బిలి– మక్కువ బీటీరోడ్డులో బగ్గందొరవలస, వెంకట భైరిపురం కూడలి నుంచి కూతవేటు దూరంలో ఉన్న గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామాల ప్రజల రాకపోకలు సువర్ణముఖీనదిలోంచి సాగుతాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొత్తవలస డ్యామ్‌ వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. డ్యామ్‌పై నాచు చేరడంతో నడవలేకపోతున్నారు. డి.శిర్లాం, గెడ్డలుప్పి ప్రజల పరిస్థితి కూడా దారుణం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు డి.శిర్లాం-వెంకట భైరిపురం, గెడ్డలుప్పి–బగ్గందొరవలస గ్రామాల వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక నాటు పడవలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సమస్యలన్నీ, సువర్ణముఖినదిపై కొత్తవలస వద్ద ఇప్పటికైనా వంతెన నిర్మించి  పరిష్కరించాలని అన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 

ప్రమాదాలను అరికట్టాలంటే, వంతెన ఒక్కటే మార్గం:  చుట్టుప్రక్కల విద్యార్ధులు, ఉద్యోగులు

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు డ్యామ్ వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక డి.శిర్లాం, గెడ్డలుప్పి నాటు పడవలో,  తక్కువ నీరు ఉన్నప్పుడు డ్యామ్ పైన ప్రమాదకర రాకపోకలు సాగిస్తున్నారు. సువర్ణముఖినదిపై కొత్తవలస వద్ద ఇప్పటికైనా వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని ప్రజలు, విద్యార్ధులు, ఉద్యోగులు, వర్తకులు అందరూ  కోరుతున్నారు.